నుమాయిష్ సందర్శకుల కోసం.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

  • రాత్రి 12 వరకు సర్వీసులు పొడిగించిన మెట్రో
  • ఫిబ్రవరి 15 వరకు ఇలాగే నడిపిస్తామని వెల్లడి
  • మియాపూర్- ఎల్బీనగర్, నాగోల్- రాయదుర్గం కారిడార్లలో వర్తింపు
  • గాంధీ భవన్ స్టేషన్ లో టికెట్ కౌంటర్లను పెంచిన అధికారులు 
నాంపల్లిలో ఆదివారం నుంచి ప్రారంభమైన నుమాయిష్ సందర్శకుల కోసం మెట్రో సర్వీసులను అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా.. దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు.. అంటే ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు.

మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్లను 6కు పెంచినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులను నడిపించినట్లు తెలిపారు. మెట్రో రైళ్లలో మద్యం సేవించకూడదని, మెట్రో సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని ప్రయాణికులకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.

Numaish
Hyderabad metro
metro services
midnight

More Telugu News